Friday, September 16, 2016

కవిత్వంపట్ల వైముఖ్యం
మనిషిని సోమరితనం వైపు
సునాయాసంగా చేర్చడం ఖాయం..

ముదిమితనం మనిషిని
ముద్దుపెట్టుకోవడం మొదలయినప్పుడు
ఒంటరితనపు చీకట్లు ఒక్కొక్కటిగా
ముసురుకోవడం మొదలెట్టినప్పుడు
ఎంతఖర్చుకయినా వెనుకంజవేయకుండా
వైద్యంచేయించినా కూడా రోగం నిదానించనప్పుడు
శేషజీవితం శుభప్రదంగా సాగాలనుకుంటే
కవిత్వపఠనమొక్కటే నిజమైన తరుణోపాయమని
ఇట్టే అర్ధమయిపోతుంది..
నేలకు రాలిపడిన నీటిబిందువును తిరిగి
హస్తగతం చేసుకోవడం అసాధ్యమేనని తెలుసు..

తెలిమబ్బులవెంట ఆశాజనకంగా పరుగులు తీయడం
ఎండమావులపట్ల ఎడతెగని విశ్వాసాన్ని ప్రకటించడమే గదా!!

సోమరిపోతులకు కాలాన్నెలా వృధాగా ఖర్చుచేయడమో తెలుసు..
పసుపురంగులు దాల్చిన ఆకులు క్రిందకు పడిపోవడంకూడా తప్పదని తెలుసు..
అందుకే మౌనాన్ని ఔదలదాలుస్తూ,పురా వైభవాన్ని మరలా
పుణికి పుచ్చుకోవడమే మేలని తెలుసుకున్నాను..
కావ్య పఠనంలోనూ,కవిత్వం పట్ల రచనాసక్తిని పెంపొందించుకోవడంలోను
కాలాన్ని అమూల్యమైన సంపదగా భావించి గుర్తించడం ప్రారంభించాను..
====================================================

No comments:

Post a Comment